వరి పేలాలు - వరి మొక్క
స్వామివారి రోజూ తీసుకునే ఆహారానికి సంబంధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
దాదాపు ఇరవైఅయిదేళ్ళ క్రితం పరమాచార్య స్వామివారు విల్లుపురం దగ్గర్లోని అయ్యుర్ గ్రామంలో మకాం చేస్తున్నారు. అప్పుడు ఈ గోపాల అయ్యర్ స్వామివారి దర్శనానికి వెళ్ళగా, హఠాత్తుగా స్వామివారు అతణ్ణి, “నాకు కావాల్సిన వరి పేలాలను తయారుచెయ్యడం నీకు కుదురుతుందా?” అని అడిగారు. ఇతను ఒక భూస్వామి కావడంతో, మరుసటిరోజే తయారుచేసి మంచి వరి పేలాలను తీసుకుని వచ్చాడు. మహాస్వామి వారు చాలా సంతోషించి “ఇవి చాలా బావున్నాయి. వీటిని రోజూ నాకు కావాల్సినంత పంపు” అన్నారు.
ఈ వరి పేలాలను స్వామివారికి సరఫరా చేసే పని తంజావూరు అడ్వకేటు వెంకట్రామ అయ్యర్ చేసేవారు. అతను వెంటనే స్వామివారిని, “ఇన్ని రోజులుగా తప్పకుండా మీకు వరి పేలాలను సరఫరా చేస్తున్న నన్ను మీరు ఇలా నిరాశ పరచవచ్చా?” అని అడిగాడు. “గోపాలన్ తెచ్చిన వరి పేలాలు కూడా బావున్నాయి. ఇన్నిరోజులూ నువ్వే ఇచ్చావు. ఇప్పుడు అతను ఇవ్వని” అన్నారు స్వామివారు. రోజూ సరఫరా చేసేవాడిని అని వెంకట్రామ అయ్యర్ అన్నందుకు “సరే నువ్వు కూడా సరఫరా చెయ్యి” అన్నారు స్వామివారు. గోపాల అయ్యర్ వరి పేలాలు బావున్నందున, వెంకట్రామ అయ్యర్ అతనివద్ద నుండే వరి ధాన్యాన్ని తీసుకుని వాటితో వరి పేలాలు చేశాడు. తరువాతి నెల ఇద్దరూ వరి పేలాలు సరఫరా చేశారు. ఒకనెల తరువాత వెంకట్రామ అయ్యర్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. వరి పేలాలను ఒకరు ఇస్తూ ఉన్నా, పరమాచార్య స్వామివారు మరొకర్ని వరి పేలాలు ఇవ్వమని ఎందుకు ఆదేశించారో అప్పుడు అర్థం అయ్యింది అందరికి.
అప్పటి నుండి గోపాల అయ్యర్ క్రమం తప్పకుండా వరి పేలాలను సరఫరా చేసేవాడు. వాటిని ఇవ్వడానికి మహాస్వామివారు మకాం చేసిన ప్రాంతాలకు సైతం వెళ్ళేవాడు. అందుకోసం గోపాల అయ్యర్ మచిలీపట్నం, హంపి, బళ్ళారి, కర్నూలు, రాజమండ్రి, సతారా, సకపట్, చెన్నై, కాంచీపురం మరియు తేనంబాక్కం వెళ్ళాడు. వరి పేలాలు తీసుకుని షోలాపూర్ వెళ్ళినప్పుడు పరమాచార్య స్వామివారు ఇక వద్దని చెప్పారు. గోపాల అయ్యర్ ఆత్రుతతో, “మీనుండి ఇటువంటి ఆజ్ఞ పొందడానికి నేను చేసిన తప్పు ఏమిటి? ఇలా అయినా నెలకొకసారి నాకు మీ దర్శన భాగ్యం కలిగేది కదా” అని స్వామివారిని అడిగాడు.
అందుకు స్వామివారు, “నేను వరి పేలాలను స్వీకరించడం ఆపేశాను. అది వరి నుండి వస్తుంది. వరి చెట్లలో జీవం ఉంటుంది. అందుకే అది పాపంగా భావించి వాటి నుండి వచ్చే ఆహారాన్ని తినడం మానేశాను. బదులుగా, పచ్చి అరటిపళ్ళ పిండిని తినాలనుకుంటున్నాను. నువ్వు దాన్ని తయారు చేసి ఇవ్వగలవా?” అని అన్నారు.
గోపాల అయ్యర్ వెంటనే ఒప్పుకున్నాడు. ఎంతో కృతజ్ఞతతో గోపాల అయ్యర్ నాతో అన్నాడు, “ఆనాటి నుండి, తిరుచ్చిలో ఉన్న నా బంధువులొకరికి నేండ్రంకాయ్ రకం అరటి పళ్ళను పంపమని చెప్పాను. వాటిని ఎండబెట్టి, రుబ్బి, దాన్నుండి చక్కని పొడిని తీసి టిన్లలో స్వామివారికి ఇచ్చేవాణ్ణి. దాన్ని స్వామివారు వారికి తగ్గట్టుగా, గంజిలా, ఇడ్లీలుగా లేదా ఏదైనా సరిపడే ఆహారంగా వాడేవారు. ఇప్పటికీ ఈ పిండిని స్వామివారికి సమర్పించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు స్వామివారు”.
పూర్వకాలం నుండి నేండ్రంకాయ్ పొడిని చిన్నపిల్లల ఆహారంగా కేరళ ప్రాంతంలో వాడేవారు. ఆహారం విషయంలో చిన్నపిల్లలకు, వృద్ధులకు కొంత సామ్యం ఉంది. వారికి తేలికగా జీర్ణమయ్యి, ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం కావాలి.
సాధారణంగా మనకు కలిగే అనుమానం; వరికి ఉన్నట్టే అరటి చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది కదా! డానికి సమాధానం, ప్రతి కోతకి వరి మొక్కని చంపి ధాన్యం సేకరించాలి, కాని అరటి చెట్టు వేర్ల నుండే చిన్న చిన్న పిలకలు మొలుస్తాయి కాబట్టి అరటిపళ్ళు కోయడం చెట్టును చంపినదాంతో సమానం కాదు.
--- పరంథమన్ వి. నారాయణన్, “పరమాచార్యర్” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం