ఎక్కడివి ఈ పాదుకలు?
దాదాపు యాభై సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు చెన్నైలో మకాం చేస్తున్నారు. మైలాపూర్, అడయార్, తిరువాన్మియూర్ మొదలైన ప్రాంతాల్లో పర్యటిస్తూ, అక్కడ త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర పూజలు చేస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. వేలమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చి, పూజలు చూసి, ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు.
ఈ సమయంలో మహాస్వామివారు తిరువాన్మియూర్లో ఉన్న మరుదీశ్వరర్ దేవాలయానికి వచ్చారు. ‘జయ జయ శంకర, హర హర శంకర’ అంటూ వేలకొలదీ భక్తులు దేవాలయానికి వచ్చారు. స్వామివారు దర్శనం అయిన తరువాత బయటకు వచ్చి, మాడవీధిలో నడుస్తూ, అక్కడ పీఠం మకాం చేస్తున్న ఒక పెద్ద బంగళాలోకి వచ్చారు.
మఠం పరివారంతో పాటు ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు అన్నిటికీ కూడా తగిన ఏర్పాట్లు చేశారు ఈ ఇంటివారు. ఆ ఇంటి యజమాని విద్యుత్ శాఖలో పనిచేసే స్వామివారి భక్తుడైన వెంకట్రామన్. స్వామివారు ఎప్పుడు తిరువాన్మియూర్ వచ్చినా ఇక్కడే బస చేసేవారు.
స్వామివారి రాకతో ఆ మాడవీధి మొత్తం కొత్త రూపు సంతరించుకుంది. స్వామివారు తమ ఇంటిలో ఉండి పూజలు చేస్తూ, తమను ఆశీర్వదించడం ఎన్నో జన్మల పుణ్యకర్మల ఫలంగా భావించేవారు వెంకట్రామన్ కుటుంబ సభ్యులు.
ఉదయం స్వామివారి విశ్వరూప దర్శనంతో మొదలుపెట్టి, చంద్రమౌళీశ్వర పూజ, తరువాత స్వామివారి ఉపన్యాసం—ఇలా రోజంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఆ ఇంటిని చూసి ఎంతగానో పరవశుడయ్యేవాడు వెంకట్రామన్.
అక్కడ కొన్ని రోజులు బస చేసిన తరువాత స్వామివారు కంచికి వెళ్లిపోయారు. ఇన్నిరోజులు పెద్ద ఉత్సవంలా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.
స్వామివారు ఆ ఇల్లు వదిలిపోయినా, ఆ ఇంట్లోవారికి ఇంకా స్వామివారు ఉన్నట్టుగానే అనిపిస్తోంది. రోజువారీ పనులు చేసుకుంటూ, స్వామివారు ఉన్నప్పటి జ్ఞాపకాలను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. మామూలుగా స్వామివారు కూర్చునే చోటు, స్వామివారు భిక్ష చేసే ప్రదేశం, స్వామివారు విశ్రమించే గది—ఇలా అన్నీ.
కొద్ది వారాల తరువాత వెంకట్రామన్ స్వామివారు పూజచేసే గదిలోకి వెళ్లి చూస్తూ ఉండగా, ఒక వస్తువును చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే చేతులతో చప్పట్లు కొట్టుకుని, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, “ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి?” అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు.
అతను చూసినది ఏమిటి?
పరమాచార్య స్వామివారి పాదుకలు!
ఆశ్చర్యాన్ని, భక్తిని సమపాళ్లలో అనుభవిస్తూ, అత్యంత సున్నితంగా స్వామివారి పాదుకలను చేతులతో తాకాడు. వాటికి మనస్ఫూర్తిగా నమస్కరించాడు.
అంతా అయోమయంగా ఉంది. స్వామివారు ఇక్కడినుండి వెళ్లి చాలా వారాలు అయ్యింది. కొన్ని వేల సార్లు ఈ వైపు వచ్చి ఉంటాను, మరి వీటిని నేను ఎందుకు చూడలేదు?
ఇంట్లోవారందరినీ పిలిచి స్వామివారి పాదుకలను అందరికీ చూపించాడు. స్వామివారే మరలా ఇంటికి తిరిగి వచ్చారు అన్నంతగా సంబరపడ్డారు ఆ పాదుకలను చూసి.
ఒక పెద్ద ఇత్తడి పళ్లెం తెచ్చి పాదుకలను ఉంచి అభిషేకం, పూజ చేశారు. గంధం, కుంకుమతో అలంకరించి, పాదుకల చుట్టూ పెద్ద పూలహారం వేశారు.
“ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి?” అని అడిగారు ఇంట్లోని పెద్దవారు.
“నాకు తెలియదు. ఇవాళే వీటిని గమనించాను. బహుశా ఇవి ఈరోజే నాకు కనబడాలని రాసిపెట్టి ఉందేమో” అని బదులిచ్చాడు.
“బహుశా స్వామివారు వెళ్లేటప్పుడు ఈ పాదుకలను మర్చిపోయారు అనుకుంటా” అని ఒక పెద్దాయన అన్నారు.
“నేను కూడా అదే అనుకుంటున్నాను” అన్నాడు వెంకట్రామన్.
వెంటనే కంచికి వెళ్లి స్వామివారికి తిరిగి ఇవ్వాలి అనుకున్నాడు.
అయితే పనిఒత్తిడి వల్ల చాలా రోజులు కంచి వెళ్లలేకపోయాడు. కానీ పాదుకలకు రోజూ పూజా, అభిషేకం తప్పక చేస్తున్నారు.
కొన్ని వారాల తరువాత కాస్త పనిభారం తగ్గడంతో పాదుకలను తీసుకుని కాంచీపురం వెళ్లాలని నిశ్చయించుకున్నాడు వెంకట్రామన్.
స్వామివారి పాదుకలను తలపై పెట్టుకుని, “జయ జయ శంకర, హర హర శంకర” అని జపిస్తూ తిరువాన్మియూర్ నుండి కంచికి పాదయాత్రగా, ఎక్కడా ఆగకుండా వెళ్లాడు.
స్వామివారి దర్శనం కోసం వేచివున్నాడు. పాదుకలను స్వామివారి ముందు ఉంచి, ఆనందాశ్రువులతో స్వామివారికి నమస్కరించి నిలబడ్డాడు.
స్వామివారు ప్రశాంతంగా వెంకట్రామన్ను చూస్తూ, పాదుకలవైపు చూపించి, “ఏమిటిదంతా?” అని అడిగారు.
“స్వామీ! మీరు తిరువాన్మియూర్లో మా ఇంటి నుండి కంచికి వచ్చేటప్పుడు వీటిని అక్కడే వదిలి వచ్చారు. అందుకనే నేను వీటిని మీకు తిరిగి ఇవ్వడానికి తీసుకుని వచ్చాను” అని చెప్పగానే స్వామివారు చిన్నగా నవ్వుతూ,
“ఓరి పిచ్చివాడా! నీకు ఇవ్వాలనే వాటిని నేను అక్కడే వదిలివచ్చాను. వాటిని ఎలా తెచ్చావో అలాగే తిరిగి తీసుకుని వెళ్లు. మరొక్కసారి నా ఆశీస్సులు ఇస్తాను” అని ఒక పిడికెడు కుంకుమను ఆ పాదుకలపై వేశారు స్వామివారు.
ఆనందంతో తన అదృష్టాన్ని తలచుకుని కన్నీళ్లపర్యంతం అయ్యాడు.
దగ్గరలో ఉన్న సేవకునివైపు చూసి, “పాపం వెంకట్రామన్ మద్రాసు నుండి నడుచుకుంటూ ఇక్కడకు వచ్చాడు. లోపలకు తీసుకువెళ్లి మంచిగా భోజనం పెట్టి, జాగ్రత్తగా ఇంటికి పంపు” అని ఆదేశించి స్వామివారు లోపలకు వెళ్లిపోయారు.